Apply Now | టాప్ కంపెనీల్లో లక్షకు పైనే ఇంటర్న్షిప్లు.. దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు
PM Internship Scheme | పీఎం ఇంటర్న్షిప్ రెండో రౌండ్కు దరఖాస్తులు గడువు మరోసారి పొడిగించారు. దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..
By Education News Team
Updated :31 Mar 2025 21:40 IST
https://results.eenadu.net/news.aspx?newsid=19022025
ఇంటర్నెట్ డెస్క్: యువతకు కొత్త నైపుణ్యాలు నేర్పించి.. ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ (PM Internship Scheme) రెండో విడతకు దరఖాస్తుల గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. 300కు పైగా కంపెనీల్లో లక్షకు పైగా ఇంటర్న్షిప్ అవకాశాల కోసం అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 15వరకు ఆన్లైన్ https://pminternship.mca.gov.in/login/ ద్వారా దరఖాస్తు చేసుకోచ్చని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ సూచించింది. అభ్యర్థులు తొలుత తమ పేర్లను వెబ్సైట్లో నమోదు చేసుకొని, ఆ తర్వాత దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్/దరఖాస్తుకు ఎలాంటి రుసుం లేదు.
రెండో విడత ఇంటర్న్షిప్కు దరఖాస్తుల గడువు తొలుత మార్చి 12తో ముగియగా.. దాన్ని 31వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఆ గడువు సైతం ముగిసిన నేపథ్యంలో ఏప్రిల్ 15వరకు మరోసారి గడువు పొడిగించారు. మరోవైపు, కొన్ని ఇంటర్న్షిప్ అవకాశాల కోసం షార్ట్లిస్టింగ్, ఎంపిక ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు తమ మొబైల్, డాష్బోర్డ్, ఈ-మెయిల్ చెక్ చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తు ఇలా..
నెలకు స్టైఫండ్ ఎంత?
- రాబోయే ఐదేళ్లలో టాప్ 500 కంపెనీల్లో కోటి మందికి నైపుణ్యాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.
- ఇంటర్న్షిప్కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.5,000 చొప్పున ఏడాది పాటు అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందిస్తారు.
- కంపెనీలో చేరే ముందు రూ.6,000 (వన్టైం గ్రాంట్) కూడా ఉంటుంది. అంటే మొత్తం మీద ఏడాదిలో రూ.66,000 పొందుతారు.
- ఈ పథకంలో స్వచ్ఛందంగా భాగస్వాములయ్యే కంపెనీలు ఏడాది పాటు ఇంటర్న్షిప్ అందిస్తాయి.
- ఇందులో కనీసం సగం కాలం తరగతి గదిలో కాకుండా వాస్తవ ఉద్యోగ వాతావరణంలో అభ్యర్థులు గడపాల్సి ఉంటుంది.
- ఈ పథకంలో ఏదైనా కంపెనీ/బ్యాంకు/ఆర్థిక సంస్థలు సదరు మంత్రిత్వ శాఖ ఆమోదంతో చేరొచ్చు.
బీమా సౌకర్యం ఉందా?
ఇంటర్న్షిప్లో చేరినవారికి వ్యక్తిగత బీమా సౌకర్యం ఉంది. పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా కల్పిస్తారు. దీనికి కావాల్సిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.
అర్హులు/అనర్హులు ఎవరు?
కొన్ని నిబంధనలకు లోబడి 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న యువతీ యువకులు ఈ పథకానికి అర్హులు. ఆన్లైన్/దూరవిద్య ప్రోగ్రామ్లో నమోదు చేసుకున్నవారితో పాటు ఎస్ఎస్సీ పాసైన అభ్యర్థులతో పాటు ఐటీఐ, పాలిటెక్నిక్, బీఏ, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఫార్మసీ వంటి డిగ్రీలు కలిగి ఉన్నవారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారి కుటుంబాలకు చెందినవారు, వార్షికాదాయం ₹8లక్షలు దాటిన కుటుంబాలతో పాటు ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్ చేసినవారు.. సీఏ, సీఎంఏ అర్హత కలిగినవారు ఈ ఇంటర్న్షిప్కు అనర్హులు.