PM Internship Scheme: టాప్-500 కంపెనీల్లో ఇంటర్న్షిప్.. స్టైఫండ్ ఎంతో తెలుసా?
యువతలో నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ను పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించింది. ఈ పథకం గురించి కొన్ని విశేషాలు మీకోసం..
Published :03 Oct 2024 19:25 IST
https://results.eenadu.net/news.aspx?newsid=03102024
Prime Minister's Internship Scheme| ఇంటర్నెట్ డెస్క్: యువతకు నైపుణ్యాలు నేర్పించి.. ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్రం పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ (PM Internship Scheme)ను ప్రారంభించింది. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60వేలు స్టైఫండ్ అందించడం ద్వారా రాబోయే ఐదేళ్లలో కోటి మందిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. 2024-25లో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టే ఈ కార్యక్రమానికి రూ.800 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1.25 లక్షల మందికి ఇంటర్న్షిప్ను అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ శిక్షణ ద్వారా నైపుణ్యాలు పొందిన వారు ఆ తర్వాత మంచి అవకాశాలు దక్కించుకొనే అవకాశం ఉంటుంది.
రిజిస్ట్రేషన్లు ఎప్పట్నుంచి?
కేంద్ర బడ్జెట్ 2024లో ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగా అగ్రశ్రేణి కంపెనీలలో ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం (PM Internship Scheme) ప్రారంభించారు. డిసెంబర్ 2నుంచి ఆరంభమయ్యే ఈ ఇంటర్న్షిప్ పథకానికి.. అభ్యర్థులు అక్టోబర్ 12 నుంచి ఆన్లైన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.
ఇంగ్లిష్లో మాట్లాడాలంటే భయమా.. ఈ టిప్స్తో ఈజీగా నేర్చుకోవచ్చు!
నెలకు స్టైఫండ్ ఎంత?
ఈ పథకంలో స్వచ్ఛందంగా భాగస్వాములయ్యే కంపెనీలు ఏడాది పాటు ఇంటర్న్షిప్ అందిస్తాయి. ఇందులో కనీసం సగం కాలం తరగతి గదిలో కాకుండా వాస్తవ ఉద్యోగ వాతావరణంలో అభ్యర్థులు గడపాల్సి ఉంటుంది. ఈ పథకంలో ఏదైనా కంపెనీ/బ్యాంకు/ఆర్థిక సంస్థలు మంత్రిత్వ శాఖ ఆమోదంతో చేరొచ్చు. ఇంటర్న్షిప్ వ్యవధిలో ఒక్కో అభ్యర్థికి నెలకు రూ.5వేలు చొప్పున సాయం అందిస్తారు. ఇందులో రూ.4,500 కేంద్రం ఇవ్వగా.. మరో రూ.500లు ఆయా కంపెనీలు తమ సీఎస్ఆర్ నిధుల నుంచి చెల్లిస్తాయి. అలాగే, ఈ పథకం కింద ఇంటర్న్ల శిక్షణకు సంబంధించిన ఖర్చులను కంపెనీలే భరిస్తాయి.
బీమా సౌకర్యం ఉందా?
ఇంటర్న్షిప్లో చేరినవారికి వ్యక్తిగత బీమా సౌకర్యం ఉంది. పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా కల్పిస్తారు. దీనికి కావాల్సిన ప్రీమియం సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుంది.
జేఈఈ మెయిన్కు ప్రిపేర్ అవుతున్నారా? ఈ టిప్స్ ట్రై చేయండి!
అర్హులు ఎవరు?
కొన్ని నిబంధనలకు లోబడి 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న యువతీ యువకులు ఈ పథకానికి అర్హులు. ఎస్ఎస్సీ పాసైన అభ్యర్థులతో పాటు ఐటీఐ, పాలిటెక్నిక్, బీఏ, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఫార్మసీ వంటి డిగ్రీలు కలిగి ఉన్నవారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారి కుటుంబాలకు చెందినవారితో పాటు ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్ చేసినవారు.. సీఏ, సీఎంఏ అర్హత కలిగినవారు ఈ ఇంటర్న్షిప్కు అనర్హులు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
పోర్టల్ను ఆవిష్కరించిన తర్వాత నిర్ణీత తేదీ నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆయా కంపెనీలు ఇచ్చే అవకాశాలను బట్టి అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, అభ్యర్థుల ఎంపికను మరింత పారదర్శకంగా చేసేలా పోర్టల్ రూపొందించారు. భాగస్వామి కంపెనీలు పోర్టల్లో ప్రత్యేక డాష్బోర్డ్లు ఉంటాయి. వీటి ద్వారానే ఇంటర్న్షిప్ అవకాశాలను పోస్ట్ చేస్తుంటారు. లొకేషన్, శిక్షణ ఇచ్చే రంగం, అర్హతలు, అందించే సౌకర్యాలు.. ఇలా పలు వివరాలను పొందుపరుస్తాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ ప్రాధాన్య రంగాలను ఎంచుకొని పోర్టల్లోనే రిజిస్టర్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత తమ దరఖాస్తుల స్టేటస్ను కూడా చెక్ చేసుకోవచ్చు.