Youth For India Fellowship | గ్రామీణ భారతంలో అధ్యయనానికి ‘యూత్‌ఫర్‌ ఇండియా ఫెలోషిప్‌’.. స్టైపెండ్‌ ఎంతంటే?

Youth For India Fellowship | గ్రామీణ భారతంలో అధ్యయనానికి ‘యూత్‌ఫర్‌ ఇండియా ఫెలోషిప్‌’.. స్టైపెండ్‌ ఎంతంటే?

గ్రామాల్లో మార్పు కోసం పనిచేయాలనే తపన ఉన్న యువతకు భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (SBI) సువర్ణావకాశం కల్పిస్తోంది. ‘యూత్‌ ఫర్‌ ఇండియా’ (YouthforIndia) పేరిట ఫెలోషిప్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Eenadu icon
By Education News Team Published :13 Feb 2024 17:35 IST

Youth For India Fellowship | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశానికి జీవనాడిగా ఉన్న గ్రామాల్లో మార్పు కోసం పనిచేయాలనే తపన ఉన్న యువతకు భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (SBI Foundation) సువర్ణావకాశం కల్పిస్తోంది. ‘యూత్‌ ఫర్‌ ఇండియా’ (YouthforIndia) పేరిట ఇచ్చే ఫెలోషిప్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దేశంలోని గ్రామాల స్థితిగతులు, అక్కడి ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై పలు ఎన్జీవోలతో కలిసి యువతతో అధ్యయనం చేయిస్తూ.. తద్వారా వారికి ఆర్థిక చేయూతనందిస్తోంది. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని, అక్కడి స్థితిగతుల్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న యువకులు ఈ ఫెలోషిప్‌లకు ఆన్‌లైన్‌లో https://youthforindia.org/ దరఖాస్తు చేసుకోవచ్చు. యూత్‌ ఫర్‌ఇండియా ఫెలోషిప్‌(2025-26)కు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలివే..

ఫెలోషిప్‌ వ్యవధి ఎంత? అర్హతలేంటీ?

ఎస్‌బీఐ ఫెలోషిప్‌ వ్యవధి 13 నెలలు. దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు 2025 అక్టోబర్‌ 1నాటికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. భారతీయ పౌరులై ఉండాలి. నేపాల్‌/భూటాన్‌ లేదా ఇండియన్‌ ఓవర్సీస్‌ సిటిజన్‌షిప్‌ (ఐఓసీ) ఉన్నవారూ అర్హులే. ఈ ప్రోగ్రామ్‌ ప్రారంభమయ్యే రోజుకు అభ్యర్థుల వయసు 21 - 32 ఏళ్ల లోపు ఉండాలి. చురుకుదనం, నాయకత్వ నైపుణ్యాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలతో మమేకం కావాలనుకొనే వారికి ప్రాధాన్యం. ముఖ్యంగా ఫెలోషిప్ సమయంలో పల్లెల్లో పర్యటించాల్సి ఉంటుంది. 13 నెలల పాటు కొనసాగే ఈ గ్రామీణ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లో కొనసాగుతూ.. సవాళ్లతో కూడిన గ్రామీణ పరిస్థితులను స్వీకరించేందుకు సిద్ధమై ఉండాలి. 

ఎంపిక విధానం?

యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రాంకు ఎంపిక విధానం దశల వారీగా ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ అండ్‌ ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. తొలుత అభ్యర్థులు తమ వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెండో దశలో సెలక్షన్ బోర్డు అడిగే అంశాలపై ఆన్‌లైన్ అసెస్‌మెంట్ అందించాల్సి ఉంటుంది. ఇందులో గ్రామీణాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, అభ్యర్థి సూచనలను అడుగుతారు. అనంతరం సెలక్షన్ బోర్డుతో పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. వీటి ఆధారంగానే తుది ఎంపిక చేపడతారు. అనంతరం ఆఫర్‌ లెటర్‌తో పాటు ప్రోగ్రామ్‌ వివరాలు, ఫెలోషిప్‌లో నిబంధనలతో కూడిన వివరాలను అందజేస్తారు. 

స్టైపెండ్‌ ఎంత?

ఈ ఫెలోషిప్‌కు ఎంపికైన వారికి వసతి కోసం నెలకు రూ.16వేలు చొప్పున స్టైపెండ్‌ రూపంలో ఇస్తారు. స్థానికంగా ప్రయాణ ఖర్చులకు రూ.2000; ప్రాజెక్టు సంబంధిత ఖర్చుల కోసం నెలకు రూ.1000 చొప్పున చెల్లిస్తారు. అలాగే, ఫెలోషిప్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఇతర అలవెన్సుల రూపంలో రూ.90,000 అందజేస్తారు.

  • ఎంపికైన వారికి తమ ఇంటి నుంచి బయల్దేరడం మొదలు ప్రాజెక్టు చేసే ప్రదేశానికి చేరుకొనే వరకు ప్రయాణానికి 3ఏసీ రైలు ఛార్జీల ఖర్చులు, శిక్షణా కార్యక్రమాల కోసం ప్రయాణాలకు అవసరమైన ఖర్చుల్ని సైతం చెల్లిస్తారు.
  • వైద్య బీమా సౌకర్యం కూడా ఉంటుంది. 
  • 2025-26కు సంబంధించి ఎస్‌బీఐ యూత్‌ఫర్‌ ఇండియా ఫెలోషిప్‌కు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. దరఖాస్తు స్టేటస్‌, తుది గడువు వంటి వివరాలను వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
  • గ్రామీణాభివృద్ధి కోసం ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియాతో కలిసి పనిచేసే ఎన్జీఓలు ఈ ఫెలోషిప్‌నకు ఎంపికైన వారికి దిశానిర్దేశం చేస్తాయి. క్షేత్రస్థాయిలో తమకు అప్పగించిన పనిని అభ్యర్థులు అర్థం చేసుకోడానికి ఎన్జీవో కేంద్రాలు సహకరిస్తాయి. అనంతరం ప్రోగ్రామ్‌ లక్ష్యానికి అనుగుణంగా వీరు కృషి చేయాల్సి ఉంటుంది. 
  • 2011లో మొదలైన ఈ ఫెలోషిప్‌ ద్వారా దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 250కి పైగా గ్రామాల్లో 640మందికి పైగా ఫెలోషిప్‌ గ్రహీతలు పల్లెల్లో మార్పు కోసం కృషిచేశారు. ఈ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో తెలుసుకోండి.