జేఈఈ మెయిన్ (సెషన్-2) దరఖాస్తులకు మరో ఛాన్స్.. అప్లికేషన్ విండో రీఓపెన్
జేఈఈ మెయిన్ సెషన్- 2కు దరఖాస్తుల (JEE Main 2026 Session 2 Application) గడువు ఫిబ్రవరి 25తో ముగిసిన విషయం తెలిసిందే.
By Education News Team
Updated :12 Mar 2026 15:52 IST
https://results.eenadu.net/education-news/jee-main-2026-session-2-application-window-reopens
ఇంటర్నెట్ డెస్క్: జేఈఈ మెయిన్ సెషన్- 2కు దరఖాస్తుల (JEE Main 2026 Session 2 Application) గడువు ఫిబ్రవరి 25తో ముగిసిన విషయం తెలిసిందే. అయితే, రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించాలంటూ పలువురు విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల దృష్ట్యా ఎన్టీఏ(NTA) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డెడ్లైన్ విధించిన గడువు లోగా అప్లికేషన్ ప్రాసెస్ను పూర్తి చేయలేకపోయిన వారి కోసం రిజిస్ట్రేషన్ల విండోను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా నేటి మధ్యాహ్నం (మార్చి 12) నుంచి మార్చి 13న రాత్రి 9గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించుకోవచ్చని, 13వ తేదీ రాత్రి 11.50గంటల వరకు దరఖాస్తు రుసుం చెల్లించేందుకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆన్లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి
ఈ ఛాన్స్ అప్లికేషన్ ఫారమ్లను విజయవంతంగా సబ్మిట్ చేయలేకపోయిన, ఫీజు చెల్లించలేకపోయినవారికి మాత్రమేనని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇప్పటికే సబ్మిట్ చేసిన అప్లికేషన్లలో ఏవైనా మార్పులు చేసేందుకు కూడా అనుమతి లేదని పేర్కొంది. అప్లికేషన్ పూర్తి చేయడంలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే విద్యార్థులు 011-40759000/011-69227700 లేదా ఈ-మెయిల్ jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చని తెలిపింది. ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా జరిగే ఈ పరీక్షకు సంబంధించిన అప్డేట్స్ను www.nta.ac.in, https://jeemain.nta.nic.in వెబ్సైట్లలో తెలుసుకోవచ్చని సూచించింది.