kendriya vidyalaya | కేవీల్లో ప్రవేశాలకు అప్లై చేశారా? లాటరీ ఫలితాలు వచ్చేశాయ్!
కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన లాటరీ ప్రక్రియను మంగళవారం (మార్చి 25న) చేపట్టారు.
By Education News Team
Published :25 Mar 2025 16:28 IST
https://results.eenadu.net/news.aspx?newsid=25032025-kendriya-vidyalaya-results
ఇంటర్నెట్ డెస్క్: పిల్లల్ని కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో చేర్పించేందుకు దరఖాస్తు చేసిన తల్లిదండ్రులకు కీలక అప్డేట్. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఒకటో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన లాటరీ ప్రక్రియను మంగళవారం (మార్చి 25న) చేపట్టారు. మార్చి 7 నుంచి 21వరకు ఒకటో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. మీ పిల్లలు ఎంపికయ్యారో, లేదో తెలుసుకొనేందుకు కేవీ సంఘటన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించి మీ దరఖాస్తు స్థితి (Application status)ని తెలుసుకోవచ్చు.
లాటరీ ఫలితాల కోసం క్లిక్ చేయండి
చెక్ చేసుకోవడం ఇలా..
- దరఖాస్తు చేసిన సమయంలో మీ మొబైల్/ఈ-మెయిల్కు వచ్చిన లాగిన్ కోడ్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
- దరఖాస్తు చేసేటప్పుడు మీరు ఎంచుకున్న మూడు పాఠశాలల్లో కేటగిరీ వారీగా మీ దరఖాస్తు లాటరీ నంబర్ కనబడుతుంది. వెయిటింగ్ లిస్ట్ నంబర్ అక్కడ డిస్ప్లే అవుతాయి.
- లాటరీ తీసిన తర్వాత మీ దరఖాస్తు పొజిషన్ను తెలిపే సమాచారం మాత్రమే. అంతేగానీ, స్కూల్లో ప్రవేశాలను నిర్ధారించే లేదా హామీ ఇచ్చే సమాచారం మాత్రం కాదని గుర్తుంచుకోండి. అడ్మిషన్లను కేంద్రీయ విద్యాలయ సంఘటన్(KVS) మార్గదర్శకాలకు అనుగుణంగా ధ్రువపత్రాల వెరిఫికేషన్ తర్వాత ఆయా దరఖాస్తుదారుల అడ్మిషన్ స్థితిని నిర్ణయిస్తాయి. ఫైనల్ అడ్మిషన్ స్టేటస్ను తెలుసుకొనేందుకు మాత్రం సంబంధిత పాఠశాలల్ని సంప్రదించండి.
- మరోవైపు, కేంద్రీయ విద్యాలయ బాలవాటికల్లో ప్రీ-ప్రైమరీలో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ మార్చి 24తో ముగిసింది. బాలవాటిక 1, 3ల్లో డ్రా ఆఫ్ లాటరీ ఫలితాలను మార్చి 28న సాయంత్రం 4గంటలకు అందుబాటులో ఉంచనున్నట్లు కేవీఎస్ వెబ్సైట్లో పేర్కొంది.
ఈ ఫేక్ వెబ్సైట్తో జాగ్రత్త!
నకిలీ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేవీ సంఘటన్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. https://kendriyabalashikshakendra.in పేరిట ఉన్న నకిలీ వెబ్సైట్తో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అందులో వచ్చిన నకిలీ సమాచారాన్ని ఎవరైనా నమ్మి నష్టపోతే అందుకు తమది బాధ్యత కాదని తేల్చి చెప్పింది.