JEE Main 2026 | జేఈఈ మెయిన్‌.. తొలిరోజు పరీక్ష ఎంతమంది రాశారు?

JEE Main 2026 | జేఈఈ మెయిన్‌.. తొలిరోజు పరీక్ష ఎంతమంది రాశారు?

జేఈఈ మెయిన్‌ ( సెషన్‌ 1 పరీక్షలు కొనసాగుతున్నాయి. మొదటి రోజైన బుధవారం (జనవరి 21) రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష జరగ్గా విజయవంతంగా జరిగింది.

Eenadu icon
By Education News Team Updated : 22 Jan 2026 16:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: జేఈఈ మెయిన్‌ (JEE Main 2026) సెషన్‌ 1 పరీక్షలు కొనసాగుతున్నాయి. మొదటి రోజైన బుధవారం (జనవరి 21) రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష విజయవంతంగా జరిగింది. దేశ వ్యాప్తంగా తొలిరోజు ఈ పరీక్షకు దాదాపు 2.6 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరైనట్లు ఎన్‌టీఏ(NTA) అధికారులు వెల్లడించారు. జనవరి 29వరకు జరగనున్న ఈ పరీక్షలకు మొత్తంగా సుమారు 14లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, తొలి రోజు జరిగిన పరీక్షల్లో షిఫ్ట్‌-1కు 1,27,562మంది (95.46శాతం) హాజరు కాగా.. షిఫ్ట్‌-2కు 1,28,938 మంది (95.77శాతం) హాజరయ్యారు. ఆయా రాష్ట్రాలు, జిల్లాల అధికారుల నిరంతర సహకారం, అభ్యర్థుల క్రమశిక్షణతో కూడిన భాగస్వామ్యం వల్ల ఈ పరీక్షను సజావుగా నిర్వహించగలిగినట్లు తెలిపారు. 

అభ్యర్థులకు కీలక సూచనలివే.. 

  • మీ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. అందులో పరీక్ష తేదీ, షిఫ్ట్, సెంటర్, రిపోర్టింగ్ సమయం, గేట్‌ మూసివేసే సమయాన్ని సరిచూసుకోండి. 

  • పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోండి. గేట్‌ మూసివేసిన తర్వాత ప్రవేశానికి అనుమతించరు. 
  • మీ వెంట అడ్మిట్‌ కార్డు (A4 ప్రింట్‌), ఒరిజినల్‌ ఫొటో ఐడీ కార్డు, ఒక పాస్‌పోర్టు సైజు ఫొటో
  • ఆధార్‌ అథెంటికేషన్‌ (Aadhaar authentication)లేని అభ్యర్థులు బయోమెట్రిక్ వెరిఫికేషన్ కోసం ముందుగానే రిపోర్ట్ చేయాలి.
  • ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచీలు, బ్యాగులు, పేపర్‌లు, ఆహారం, తాగునీటి బాటిళ్లకు అనుమతిలేదు. మధుమేహం ఉన్న అభ్యర్థులకు అనుమతించిన  కొన్ని వస్తువులు మినహాయింపు ఉంది. 
  • ఈ పరీక్ష కంప్యూటర్‌ ఆధారితంగా ఉంటుంది. సీసీటీవీ నిఘా ఉంటుంది. ఏవైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.

జేఈఈ మెయిన్‌ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే.. jeemain@nta.ac.in లేదా 011-40759000 నంబర్‌ని సంప్రదించవచ్చు.