Telangana CETs Schedule | టీజీ ఎప్ సెట్, ఐసెట్, పీజీ ఈసెట్లకు షెడ్యూల్ విడుదల.. దరఖాస్తులు ఎప్పట్నుంచంటే?
తెలంగాణలోని పలు ప్రవేశ పరీక్షలకు షెడ్యూళ్లు విడుదలయ్యాయి. ఎప్సెట్, ఐసెట్, పీజీఈసెట్లకు సంబంధించిన వివరాలివే..
By Education News Team
Published :03 Feb 2024 18:35 IST
https://results.eenadu.net/news.aspx?newsid=030225
హైదరాబాద్: తెలంగాణలో పలు ముఖ్యమైన ప్రవేశ పరీక్షలకు షెడ్యూళ్లు విడుదలయ్యాయి. 2025-26 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలో ఇంజినీరింగ్/ అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ (ఎప్సెట్) (TG EAPCET 2025)తో పాటు టీజీ ఐసెట్ (TG ICET), పీజీ ఈసెట్(PG ECET)లకు ఉన్నత విద్యామండలి వేర్వేరుగా అధికారిక వెబ్సైట్లో షెడ్యూల్ను విడుదల చేసింది. సోమవారం జేఎన్టీయూ- హైదరాబాద్ వీసీ ఛాంబర్లో సెట్ల కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డితో పాటు ఆయా సెట్ల కన్వీనర్లు, కో- కన్వీనర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరై ఈ మూడు సెట్ల షెడ్యూళ్లకు ఆమోదం తెలిపారు. పూర్తి వివరాలివే..
తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAPCET) జేఎన్టీయూ- హెచ్ ఆధ్వర్యంలో జరగనుంది.
- నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 20న
- ఆన్లైన్ దరఖాస్తులు: ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 4వరకు (ఆలస్య రుసుం లేకుండా)
- అగ్రికల్చర్, ఫార్మా విభాగం పరీక్షలు: ఏప్రిల్ 29, 30 తేదీల్లో
- ఇంజినీరింగ్ విభాగం పరీక్ష: మే 2 నుంచి 5వ తేదీ వరకు
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఐసెట్ పరీక్ష నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది.
- నోటిఫికేషన్ విడుదల: మార్చి 6
- ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: మార్చి 10 నుంచి మే 3 వరకు (ఆలస్య రుసుం లేకుండా)
- దరఖాస్తు రుసుం: జనరల్ కేటగిరీ రూ.750; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు రూ.550
- ఆన్లైన్ పరీక్ష తేదీ: జూన్ 8, 9 తేదీల్లో రెండు సెషన్లలో
- ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు మొదటి సెషన్; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సెషన్
ఇంజినీరింగ్, ఫార్మసీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీ ఈసెట్ పరీక్ష జేఎన్టీయూ- హైదరాబాద్ ఆధ్వర్యంలో జరుగుతుంది.
- నోటిఫికేషన్ విడుదల : మార్చి 12న
- ఆన్లైన్ దరఖాస్తులు: మార్చి 17 నుంచి మే 19వరకు (ఆలస్య రుసుం లేకుండా)
- పరీక్ష తేదీ: జూన్ 16 నుంచి 19వరకు