UPSC Civils 2026: సివిల్స్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ప్రిలిమ్స్ ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తోన్న యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష(UPSC CSE 2026)కు నోటిఫికేషన్ వచ్చేసింది.
By Education News Team
Updated : 04 Feb 2026 21:27 IST
https://results.eenadu.net/education-news/UPSC-CSE-2026-Notification-Release
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తోన్న యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష(UPSC CSE 2026)కు నోటిఫికేషన్ వచ్చేసింది. అఖిల భారత సర్వీసుల్లో 933 పోస్టుల భర్తీ కోసం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్(CSE) 2026 పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) బుధవారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. UPSC CSE 2026 పరీక్షకు నేటి నుంచి ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష మే 24న, మెయిన్స్ పరీక్ష ఆగస్టు 21 నుంచి జరగనున్నాయి. దీంతో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో 80 పోస్టుల భర్తీకి విడిగా నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఆన్లైన్ దరఖాస్తుల కోసం క్లిక్ చేయండి
సివిల్స్-2026 నోటిఫికేషన్లో కొన్ని ముఖ్యాంశాలివే..
- విద్యార్హతలు: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
- వయో పరిమితి: అభ్యర్థుల వయసు 21నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. (ఆగస్టు 1, 2026ను కటాఫ్ తేదీగా నిర్ణయించారు.)
- ఆయా వర్గాలకు రిజర్వేషన్ల ఆధారంగా మినహాయింపు ఉంది.
- దరఖాస్తు రుసుం: ఓబీసి, ఇతర అభ్యర్థులకు రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు)
- ప్రిలిమినరీ పరీక్ష: ఇందులో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. ఈ ప్రశ్నల్లో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ రాసేందుకు అనుమతిస్తారు.
- మెయిన్స్ పరీక్ష: ఇది డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి రూల్ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
- తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, హైదరాబాద్, హన్మకొండ
- మెయిన్స్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ. సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి